పోలవరం, జనవరి 8 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవడానికి విపక్షాలు పెద్ద ఎత్తులో ప్రయత్నం చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నేడు పోలవరాన్ని సందర్శించడానికి విచ్చేసిన సీఎం చంద్రబాబు అక్కడి పనులను పరిశీలించి, పనుల ప్రగతిని ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. అలాగే, అగ్రిగేట్ కూలింగ్ ప్లాంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ఎంతో లాభదాయకం అన్నారు. ఈ మేరకుపోలారం ప్రాజెక్టు పూర్తిచేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీ, వైకాపా మాత్రం పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాయని చెప్పారు. కాగా, రాష్ట్రంలో 29 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి లక్ష్యం నిర్దేశించుకోగా, ఇప్పటికి 9 ప్రాజెక్టులు పూర్తి చేశామని, మరో 8 ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు.