కరీంనగర్, జనవరి 8 : సులభతర వాణిజ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కరీంనగర్లో ఐటీ టవర్కు శంకుస్థాపన చేసిన ఆయన.. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో ఆర్థిక వృద్ధిరేటు దేశంలోనే నంబర్వన్ స్థాయిలో ఉందని, మూడున్నరేళ్లలో సులభతర వాణిజ్య రంగంలో తొలిస్థానంలో ఉందన్నారు. ఇదంతా కేసీఆర్ పోరాటపటిమ అన్నారు. గత పాలకులు తెలంగాణ వస్తే కరెంటు కష్టాలు వస్తాయన్నారు. అలాంటి ఆరోపణలను తెరాస ప్రభుత్వం పటాపంచలు చేసిందన్నారు. అంతేకాకుండా ఎంతో పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకోవాలనేదే ప్రభుత్వం ధ్యేయం అన్నారు.