సత్తెనపల్లి, జనవరి 8 : గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జన్మభూమి పెన్షన్ లపై వైసీపీ నేత అంబటి రాంబాబు, టీడీపీ నేత బుద్దా వెంకన్నల సవాల్ జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబును అతని ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేశారు. సీఆర్పీసీ 149 ప్రకారం అంబటికి నోటీసులు జరీ చేశారు. మరోవైపు చర్చలకు బయలుదేరిన వెంకన్నను సైతం పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. "బుద్దా వెంకన్నను అనుమతించి నన్ను ఇలా హౌస్ అరెస్ట్ చేయడం అన్యాయం. చర్చలకు నేను సిద్దంగా ఉన్నా.. టీడీపీ పారిపోతుంది. సమాధానాలు చెప్పలేకనే నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఒకవేళ నన్ను అనుమతిస్తే.. సత్తెనపల్లి వెళ్ళడానికి నేను సిద్దం" అన్నారు. అదే విధంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. "జగన్ పార్టీ అబద్దాల పార్టీ కావున చెక్ పెట్టేందుకే నేను సత్తెనపల్లి వెళ్తున్నా. అసలు భయమన్నది నా బ్లడ్ లోనే లేదు. అన్నింటికీ నేను సిద్దం" అంటూ పేర్కొన్నారు. ఇలాంటి ఉద్రిక్తతల మధ్య సత్తెనపల్లిలో భారీగా పోలీసులు మోహరించి సెక్షన్ 30 విధించారు.