రాజమహేంద్రవరం, జనవరి 7 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం రూపుదిద్దుకుంటున్న పోలవరం కోసం కాంగ్రెస్ పార్టీ ధవళేశ్వరం కాటన్ విగ్రహం నుంచి పోలవరం ప్రాజెక్టు వరకు చేపట్టిన పాదయాత్ర నేడు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన సభలో పాండిచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ...2019లో తామే ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తామన్నారు. గత కాంగ్రెస్ దివంగత నేత సీఎం అంజయ్య ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తే.. డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇందిరా పోలవరం సాగర్గా నామకరణం చేసి ప్రాజెక్టు పనులను వేగవంతం చేశారన్నారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో సుమారు రూ.5,200 కోట్లతో కుడి, ఎడమ కాల్వల నిర్మాణాలు పూర్తి చేశారు. కానీ నేటి ముఖ్యమంత్రి అంతా తన ఘనతే అని చాటుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. అంతేకాకుండా ఈ మూడేళ్లలో రాష్ట్రంలో ఏ మేరకు అభివృద్ధి సాధించారంటూ ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ మంత్రులు, నేతలు తదితరులు పాల్గొన్నారు.