పోలవరం, జనవరి 6 : పోలవరం ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. కాఫర్ డ్యాం నిర్మాణానికి ఆకృతుల కమిటీ ఆమోదం తెలిపింది. అయితే ఎత్తు ఎంతవరకు ఉండాలన్న విషయాన్ని తర్వాత వెల్లడిస్తామన్న కమిటీ.. త్వరితగతిన పనులు చేయాలంటూ పేర్కొంది. కాగా డ్యాం నిర్మాణంపై ఇటీవల అధ్యయనం చేసి నివేదికను సమర్పించిన కేంద్ర జలవిద్యుత్తు పరిశోధన కార్పొరేషన్ (ఎన్హెచ్పీసీ) కమిటీ, కాఫర్ డ్యాంకు ప్రత్యామ్నాయాలు సూచించింది. అవి అమలు చేయలేమని డ్యాం ఆకృతుల కమిటీ స్పష్టం చేసింది. జెట్గ్రౌటింగ్ సహా ఇతర పనులను కొనసాగించుకోవచ్చని పేర్కొంది. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పిలిచిన టెండర్ల ప్రక్రియ పనులను కొనసాగించవచ్చని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి అంగీకారం తెలిపారు. ఈ పరిణామాలతో దాదాపు అడ్డంకులు తొలగిపోయి పోలవరం పనులు వేగవంతం అయ్యేందుకు ఆస్కారం ఏర్పడింది.