రాజమహేంద్రవరం, జనవరి 6 : ఐటీ శాఖ మంత్రి లోకేష్ తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా.. కాకినాడ మండలం పండూరులో మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. ఇంటింటికి కుళాయి ఏర్పాటు చేయడమే లక్ష్యమని, దీనిద్వారా 16 గ్రామాలకు నీరందించనున్నామన్నారు. అనంతరం పెద్దాపురంలోని ఏపీఐఐసీ పారిశ్రామిక వాడలో 250 కోట్లతో ఏర్పాటుచేసిన అపర్ణ వెటిరో సిరామిక్స్ పరిశ్రమను ప్రారంభించారు. ఈ సందర్బంగా లోకేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఐటీ, తయారీ రంగాల ద్వారా 2019 నాటికి 3 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా 16 వేల కోట్లు రుణమాఫీ చేసి, అరకోటి మందికి పైగా పెన్షన్లు ఇస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర విభజన అనంతరం ఆదాయమంతా ఒకరికి ఇచ్చి అప్పులు మాత్రం మన నెత్తిపై పెట్టారని లోకేష్ వ్యాఖ్యానించారు. 2018లోగా ఈ పనులన్ని పూర్తి చేసి 2019లో ఓట్లు అడుగుతామని తెలిపారు.