అమరావతి, జనవరి 4 : ఈ ఏడాది భూగర్భ జలాలు పెరగడంతో రాయలసీమ వాసులంతా సంతోషంగా ఉన్నారని జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. తెరాసా అధికారంలోకి వచ్చిన నాటి నుండి సాగునీటి ప్రాజెక్టుల నిమిత్తం కడప జిల్లాల్లో 2, 182 కోట్ల రూపాయల మేర ఖర్చు చేశామన్నారు. ఈ నేపథ్యంలో వైకాపా నేతల తీరుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండిపోతున్న చీని చెట్లకు నీరందించి రైతులను కాపాడితే.. చెంబుతో నీళ్లు పోశారంటూ వైకాపా నేతలు బాధ్యతా రాహిత్యంగా మాట్లాడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది ప్రభుత్వ హయాంలో పులివెందులకు ఒక్క చుక్క నీటిని కూడా ఎందుకు ఇవ్వలేకపోయారో వారు ఆత్మ విమర్శ చేసుకోవాలని దుయ్యబట్టారు. పులివెందులకు నీటిని విడుదల చేసిన ఘనత మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని తెలిపారు. సాగు నీటిపై కనీస పరిజ్ఞానం లేకుండా జగన్, వైకాపా నేతలు మాట్లాడడం సరికాదు. అది వారి అజ్ఞానాన్ని తెలుపుతోందని ఎద్దేవా చేశారు.