అమరావతి, జనవరి 4 : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమం విజయవంతంగా రెండు రోజులు పూర్తి చేసుకుని మూడో రోజైన నేటి షెడ్యూల్ నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాల కలెక్టర్లు, నోడల్ అధికారులు, ప్రజాప్రతినిధులతో ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నేపధ్యంలో ఆయన మాట్లాడుతూ...ఈ కార్యక్రమానికి హాజరయ్యే సిబ్బందికి వర్కింగ్ లంచ్ ఇవ్వాలని, ప్రజలకు పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి జన్మభూమి కంటే మెరుగైన వేదిక లేదని, ఇంతకన్నా మంచి అవకాశం రాదని ఆయన పేర్కొన్నారు. అయితే, రాజకీయ యంత్రాంగం, అధికారులందరూ కలిస్తే ప్రజల్లో సంతృప్తి సాధ్యమని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా యువత ఇందులో పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని తెలిపారు. ఈ మేరకు అన్ని శాఖలు బాధ్యతగా వ్యవహరిస్తూ సమన్వయంతో పనిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.