హైదరాబాద్, జనవరి 03 : నేడు హైదరాబాద్ లోని మాదాపూర్ సమీపన ఉన్న అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో అండర్ పాస్ మార్గం అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ పురపాలక శాఖమంత్రి కేటీఆర్ ఈ అండర్ పాస్ మార్గాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ...ఈ అండర్ పాస్ బ్రిడ్జిని నిర్ణీత గడువులోగా అధికారులు పూర్తి చేయడం అభినందనీయమన్నారు. నూతన సాంకేతిక ఉపయోగించి రహదారులను మెరుగుపరుస్తామన్నారు. ఇవాంక ట్రంప్ పర్యటన కోసమే హైదరాబాద్లో రోడ్లు బాగు చేశారన్న ఆరోపణల్లో నిజం లేదని.. నగరంలో రోడ్ల సుందరీకరణ అంతకుముందే చేపట్టామని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కొంత సమయం పడుతుందన్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులు, పనులన్నీ 2018లో పూర్తవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నాయిని నరసింహ రెడ్డి, మహేందర్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయితే, ఈ మార్గం సుమారు 450 మీటర్ల పొడువు ఉండగా, ట్రాఫిక్ రద్దీని తగించేందుకు దోహదపడుతుందని జీహెచ్ఎంసీ భావిస్తుంది.