ముంబై, డిసెంబర్ 30 : ప్రస్తుత భారత్ క్రికెట్ విజయాలలో ఫిట్ నెస్ పాత్ర విస్మరించ లేనిది. జాతీయ జట్టులో స్థానం సంపాదించుకోవడానికి ప్రవేశ పెట్టిన యో-యో టెస్ట్ ఇటీవల హాట్ టాపిక్గా మారింది. ఈ పరీక్షలో విఫలమైన సీనియర్ ఆటగాళ్లు యువరాజ్, అశ్విన్, రైనా, తర్వాత పాసయ్యారు. కాగా ప్రస్తుతం 16.1గా ఉన్న టీమిండియా యోయో బెంచ్మార్క్ను ఇంకా పెంచబోతున్నారని సమాచారం. జట్టు ఫిట్నెస్ ప్రమాణాలను మరింత పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకోనున్నారట. బెంచ్మార్క్ను 16.5 లేదా 17కు పెంచాలని బోర్డు ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ‘అన్ని విభాగాల్లోనూ టీమిండియా మెరుగ్గా ఉండాలి. అందులో ఫిట్నెస్కు మినహాయింపేమీ లేదు. తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు’ అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. కాగా యో-యో బెంచ్ మార్క్ పాక్లో 17.4, న్యూజిలాండ్లో 20.1గా అమలుచేస్తున్నారు.