తిరుపతి, జూన్ 19 : తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) వారి ఆధ్వర్యంలో నిర్వహించే పలు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు పొందడానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సోమవారం నుంచి 22 వ తేదీ వరకు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాలలో తొలి విడత కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్టు తితిదే విద్యాశాఖాధికారి ఆర్. స్నేహలత ప్రకటించారు. ఈ నెల 19 న అన్ని ప్రత్యేక కేటగిరీల విద్యార్థులకు కౌన్సిలింగ్ ఉంటుందని, 20 న గణితం కాంబినేషన్ కోర్సులకు, 21 న సైన్స్ కాంబినేషన్ కోర్సులకు దరఖాస్తు చేసిన ఓసీ విద్యార్థులు 900 ఆపైన మార్కులు వచ్చినవారు, బీసీ విద్యార్థులు 800, ఆపైన మార్కులు వచ్చినవారు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 750, ఆపైన మార్కులు వచ్చినవారు హాజరవ్వాలని ఆమె తెలిపారు. కౌన్సిలింగ్ కు హాజరయ్యే అభ్యర్థులు ఒరిజినల్ ధృవపత్రాలతో సహా రెండు జతల జిరాక్స్ పత్రాలు, రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు, ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలు, ఆధార్, రేషన్ కార్డు జిరాక్స్ లు తీసుకురావాలని సూచించారు. ప్రతిభ ఆధారంగా వసతి గృహ సీట్లను కేటాయిస్తామని తెలిపారు.