బెంగుళూరు, డిసెంబర్ 29: ఎక్కడైనా ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి అని అంటారు. కానీ ఇక్కడ అదృష్ట సరస్వతి ఏంటి అనుకుంటున్నారా.. అవునండి. రాబోయే నూతన సంవత్సరం జనవరి 1న బెంగళూరు నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పుట్టే తొలి ఆడబిడ్డకు డిగ్రీ వరకూ ఉచిత విద్యను అందిస్తామని నగర మేయర్ ప్రకటించారు. ఈ సందర్బంగా మేయర్ ఆర్.సంపత్రాజ్ మాట్లాడుతూ... జనవరి 1న సాధారణ కాన్పు ద్వారా జన్మించిన తొలి బిడ్డకు, నగర కమిషనర్ పేరిట ఓ ఉమ్మడి ఖాతాను తెరిచి బృహత్ బెంగళూరు మహానగర్ పలికె (బీబీఎంపీ) రూ.5లక్షలను డిపాజిట్ చేస్తుందన్నారు. సిజేరియన్ ద్వారా జన్మించిన బిడ్డకు ఇది వర్తించదని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమాన్ని నగర వాసులు అభినందిస్తున్నారు.