న్యూఢిల్లీ, డిసెంబర్ 29 : ప్రపంచ క్రికెట్ చరిత్ర రూపురేఖలను మార్చేసిన మెగా టోర్నీ ఏదంటే ‘ఐపీఎల్’ అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. లలిత్ మోదీ మానస పుత్రికగా 2008 లో ప్రారంభమైన ఐపీఎల్ అంచెలంచలుగా ఎదిగి ఎంతో మంది క్రీడాభిమానులు సంపాదించుకుంది. కాగా ఈ లీగ్ ఈ ఏడాది గూగుల్ లో కూడా తన హవాను చాటింది. ఈ సంవత్సరం ఎక్కువ మంది భారత క్రీడాభిమానులు శోధించింది ఐపీఎల్ కోసమేనని ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ వెల్లడించింది. గూగుల్ సంస్థ ఎక్కువ మంది భారతీయులు శోధించిన టాప్-10 క్రీడా అంశాలకు సంబంధించిన డేటాను విడుదల చేసింది. ఇందులో ఐపీఎల్ అగ్రస్థానంలో ఉండగా, జూన్లో ఇంగ్లాండ్లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ట్రెండింగ్లో నిలిచిన అంశాల్లోనూ ‘ఐపీఎల్’ రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానాన్ని ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు రాజమౌళి సృష్టించిన అద్భుత దృశ్యకావ్యం ‘బాహుబలి-2’ ఆక్రమించింది.