కాబూల్, డిసెంబర్ 28: ఆఫ్గాన్ రాజధాని కాబూల్లో ఉగ్రదాడి చోటు చేసుకుంది. ఈ దాడిలో సుమారు 40 మంది చనిపోయినట్లు, మరో 30 మందికి పైగా గాయపడినట్లు ఆఫ్గాన్ హోంశాఖ వెల్లడించింది.. వివరాల్లోకి వెళితే... నగరంలోని సాంస్కృతిక కేంద్రంవద్ద గురువారం వద్ద కొందరు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. వెంటవెంటనే రెండు పేలుళ్లు సంభవించాయి. ఘటన జరిగిన సమీపంలో ఆఫ్గాన్ వాయిస్ ఏజెన్సీ ఉంది. దానిని లక్ష్యంగా చేసుకునే దాడికి పాల్పడి ఉంటారు’ అని హోంశాఖ అధికార ప్రతినిధి నజీబ్ దానిశ్ తెలిపారు. మరోవైపు దాడి చేసింది తాము కాదని తాలిబన్ ఉగ్రవాదులు వెల్లడించారు. దీంతో అధికారులు అప్రమత్తమై ఈ దాడికి ఎవరు బాధ్యులు? అన్న దానిపై దర్యాప్తు చేపట్టారు.