రాజమండ్రి, జూన్ 18: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆదివారం లేఖ రాశారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి మారుతూ అధికారంలోకి వచ్చినవారే భూ దందాలకు పాల్పడుతున్నారని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. అలాంటి వారికి గేట్లు మూసేయాలని, భూ దందాలపై విచారణ జరపాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. భూ దోపిడీకి పాల్పడేవారికి చరమగీతం పాడాలని ఆయన సూచించారు. విశాఖ జిల్లాకు చెందిన మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావుల మధ్య చాలా కాలంగా విబేధాలు ఉన్నాయని వీర్రాజు ఆరోపించారు. ఇటీవల విశాఖలో వెలుగు చూసిన భూ కుంభకోణంలో గంటా పాత్ర ఉందంటూ అయ్యన్నపాత్రుడు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ భూకబ్జాలు చేసే వారిలో టీడీపీ నేతలు ఉన్నారంటూ గంటాను ఉద్దేశించి పత్రికా సమావేశాల్లోనూ చెప్పారు. ఈ నేపథ్యంలో గంటా స్పందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ కూడా రాశారు.