తొలి విజయాన్ని ఖాతాలో వేసుకున్న భారత్

SMTV Desk 2017-06-18 17:29:38  Cricket,Hockey,Badminton,Indoneshiya Open Badminton Series

జకార్తా, జూన్ 18 : క్రికెట్‌, హాకీ, బ్యాడ్మింటన్‌లలో భారత్‌ ఈ రోజు కీలక మ్యాచ్‌లను ఆడుతోంది. దీంతో భారత్‌కు ఈ ఆదివారం త్రిముఖ పోరు నడుస్తుందని అన్నారు. అన్నట్టుగానే ఈ పోరులో భారత్‌ తొలి విజయాన్ని కైవసం చేసుకుంది. జకార్తాలో జరిగిన ఇండోనేసియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ సిరీస్‌లో తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్‌ విజేతగా నిలిచాడు. పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో జపాన్‌ ఆటగాడు కజుమాసా సకాయ్‌తో తలపడిన శ్రీకాంత్‌ రెండు వరుస సెట్లలో విజయం సాధించాడు. 13నిమిషాల్లోనే తొలి సెట్‌ను 21-11తో కైవసం చేసుకున్న శ్రీకాంత్‌కు రెండో సెట్లో అనుకోని సంఘటన ఎదురైంది. ఓ దశలో వెనుకబడిన శ్రీకాంత్‌ ఆ తర్వాత తేరుకుని సుకాయ్‌పై విజృంభించాడు. దీంతో హోరాహోరీగా సాగిన రెండో సెట్‌ను శ్రీకాంత్‌ 21-19తో గెలిచి ఇండోనేసియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ సూపర్‌ సిరీస్‌లో పురుషుల సింగిల్స్‌లో విజేతగా నిలిచాడు.శ్రీకాంత్‌ మూడో సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ను గెల్చుకున్నాడు.