హాంకాంగ్, జూన్ 18 : ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో సుదీర్ఘ ప్రయాణం చేయాల్సివస్తుంది. ఒక్కరే డ్రైవింగ్ చేస్తూ వెళ్తుంటే కునుకుతీసే ప్రమాదం ఉంది. ఇలాంటప్పుడు ఆత్మవిశ్వాసంతో డ్రైవింగ్ చేసినా, ఒక్క క్షణం కునుకు ప్రాణాలను ప్రమాదంలోకి తీసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో ప్రయాణ సమయంలో నిద్రాభారంతో రోడ్డు ప్రమాదాలను నివారించడం లక్ష్యంగా హాంకాంగ్ కు చెందిన బాప్టిస్ట్ యూనివర్సిటీ నిపుణులు చెయుంగ్ యూమింగ్ ఓ స్మార్ట్ యాప్ ను అభివృద్ధి చేశారు. ఈ యాప్ ను నిక్షిప్తం చేసుకున్న స్మార్ట్ ఫోనే డ్రైవింగ్ లో రక్షణ కవచంలా మారుతుందని దీని రూపకర్తలు వెల్లడిస్తున్నారు. ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకున్న అనంతరం ఫోన్ ను ‘స్టీరింగ్ వీల్’పై పెట్టాలి. ఫోన్ కెమెరా ఫోకస్ మన మొహంపై ఉండేలా చూసుకోవాలి. దీంతో మన రెప్పలు వాలినా, కునుకు తీసినా, మగత లక్షణాలు కనిపించినా వెంటనే స్మార్ట్ అలారం మోగుతుంది. దీంతో డ్రైవింగ్ చేసే వ్యక్తి అప్రమత్తమయ్యే అవకాశం ఉందన్నారు. ఈ యాప్ ఉపయోగించేందుకు ఎలాంటి అదనపు సెన్సర్లూ అవసరంలేదని, తక్కువ ధరకే ఇది అందుబాటులోకి వస్తుందని పరిశోధకులు తెలుపుతూ ప్రయాణీకుల భద్రత కోసమే దీన్ని అభివృద్ధిలోకి వెల్లడించారు.