ముంబై, డిసెంబర్ 25 : విన్నింగ్ షాట్...అంటే అభిమానులకు ఏక్కడ లేని ఉత్సాహం వస్తుంది. అదే షాట్ ధోని కొడితే...ఇంకా వేరే చెప్పాలా... అంతే కాకుండా ఈ ఏడాది లో అదే చివరి షాట్ అయితే ఆ అపూర్వ క్షణం ఏ క్రీడాభిమాని మరిచిపోలేడు. అంతటి మహా అవకాశం చూసే అదృష్టం నిన్న ముంబైలో లంకతో జరిగిన చివరి టీ-20 లో అభిమానులకు దక్కింది. మ్యాచ్ చివర్లో కొంత ఉత్కంఠ రేపినా ధోని, కార్తీక్లు భారత్ విజయాన్ని సులభం చేశారు. రెండు ఓవర్లో భారత్ విజయానికి 15 పరుగులు చేయాల్సి ఉండగా.. ఈ ఇద్దరు బాల్ టు బాల్ సింగిల్స్ తీశారు. కార్తీక్ సిక్స్ కొట్టడంతో చివరి ఓవర్లో 3 పరుగులు అవసరమయ్యాయి. స్ట్రైకింగ్లో ఉన్న ధోని తొలి బంతికి రెండు పరుగులు రాబట్టాడు. రెండో బంతిని బౌండరీకి తరలించి విన్నింగ్ షాట్తో మ్యాచ్ను ముగించాడు. బీసీసీఐ పోస్ట్ చేసిన ఈ వీడియో అంతర్జాలంలో హల్ చల్ చేస్తుంది. పోస్ట్ చేసిన వీడియో కొద్ది గంటల్లోనే 31 వేలకు పైగా వ్యూస్, ఏడువేల లైక్లు వచ్చాయి. కాగా విన్నింగ్ షాట్ ధోనికి కొత్త కాదు ఇంతకముందు ఎన్నో సార్లు అలాంటి షాట్ లతో జట్టు కు విజయాన్ని అందించాడు. అందులో 2011 ప్రపంచకప్ ఫైనల్ విన్నింగ్ షాట్ అయితే అనిర్వచనీయం.