న్యూఢిల్లీ, డిసెంబర్ 24 : దేశంలోని ఎన్నారైలు ఓటు హక్కు నమోదు చేసుకున్న ఇప్పటి వరకు ఓటింగ్ రోజున వారి నియోజకవర్గానికి వచ్చి ఓటు వేసేందుకు మాత్రమే అనుమతి ఉంది. ఇది కష్టంతో కూడుకున్న వ్యవహారం కావడంతో, తాజాగా ఈ అంశం చర్చకు వచ్చింది. మరోవైపు ఎన్నారై ఓటర్లకు సంబంధించి ఓ ప్రశ్నకు న్యాయశాఖ సహాయ మంత్రి పీపీ చౌదరి లోకసభలో సమాధానమిచ్చారు. డిసెంబర్ 15 నాటికి 24,348 మంది విదేశీ ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. అందులో 1920 మంది మహిళలు ఉన్నారని పేర్కొన్నారు. 2014 నాటికి మొత్తం విదేశీ ఓటర్ల సంఖ్య 11,846 మాత్రమే. అందులో కేవలం 706 మంది మాత్రమే మహిళలు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. తాజా గణాంకాల ప్రకారం, 24,348 మంది ఓటర్లలో ఒక్క కేరళ నుంచే 23,556 మంది విదేశీ ఓటర్లుగా నమోదు చేసుకోవడం గమనార్హం. అయితే, విదేశాల్లో ఉంటున్న ఓటర్లతో పోలిస్తే నమోదు చేసుకున్న వారి సంఖ్య మాత్రం ఇప్పటికీ నామమాత్రంగానే ఉంది.