అమరావతి, డిసెంబర్ 23: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో ఐటీ కంపెనీలు తీసుకురావడానికి తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. అంతేకాదు ఐటీ కంపెనీల ప్రతినిధులను ఇంటికి తీసుకువెళ్లి ఆతిథ్యం ఇచ్చేవాడినని చెప్పారు. హైదరాబాద్కు తొలి ఎమిరేట్స్ విమాన సర్వీసు తీసుకురావడానికి ఎంతో శ్రమించాల్సి వచ్చిందని, ఆ రోజుల్లో ఐటీకీ ప్రత్యేకంగా వ్యవస్థ లేదని, పేషీలో ఒకేఒకరు ఐటీశాఖను సింగిల్ మ్యాన్ ఆర్మీగా నిర్వహించేవారని అన్నారు. ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాలని, ఐటీ శాఖలో అవినీతి అసలు కనిపించకూడదని, నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యానికి వీల్లేదని స్పష్టం చేశారు.