న్యూఢిల్లీ, డిసెంబర్ 22 : ఉత్పత్తుల తయారీ ఖర్చులు పెరగడంతో ఆటోమొబైల్ సంస్థలన్ని ప్రస్తుతం ధరల పెంపు బాట పట్టాయి. తాజాగా ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరోమోటోకార్ప్ కూడా అదే బాటలో పయనిస్తోంది. తమ మోడళ్లపై రూ. 400 నుంచి ధరలను పెంచుతున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. "వచ్చే నూతన సంవత్సరం నుండి మా ఉత్పత్తుల ధరలను రూ. 400 నుంచి పెంచుతున్నాం. ఆయా మోడళ్లు, మార్కెట్లను బట్టి ఈ పెంపు ధర మారుతుంది" అని హీరోమోటోకార్ప్ వెల్లడించింది. కాగా ప్రస్తుతం ఈ కంపెనీ రూ. 42,432 విలువైన ఎంట్రీ లెవల్ హెచ్ఎఫ్ డీలక్స్ నుంచి రూ. 1.10లక్షల విలువైన కరిజ్మా జీఎంఆర్ వరకు పలు మోడళ్ల బైక్లను విక్రయిస్తోంది.