కళాశాల బస్సు ఢీకొని చిన్నారి మృతి...

SMTV Desk 2017-12-21 14:45:14  road accident, hyderabad, kottapeta, maruthinagar

హైదరాబాద్, డిసెంబర్ 21: నగరంలో లారీ ఢీకొని ఉప్పల్‌కు చెందిన చిన్నారి భూమిక మృతి చెందిన ఘటన మరువక ముందే మరో దుర్ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంజినీరింగ్‌ కళాశాల బస్సు డ్రైవర్ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టాడు. దీంతో చిన్నాన్నతో కలిసి బండిపై వెళ్తున్న చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే... కొత్తపేట మారుతీనగర్‌కు చెందిన బొడ్డుపల్లి బాలకిషన్‌ కుమార్తె మధుశాలిని(12) ఆరో తరగతి చదువుతోంది. అబ్దుల్లాపూర్‌మెట్‌లోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరయ్యేందుకని చిన్నాన్న వెంకటేష్‌తో కలిసి బుధవారం ఉదయం ద్విచక్ర వాహనంపై బయల్దేరింది. ఆ సమయంలో పసుమాముల వెళ్లే ఆర్టీసీ అద్దెబస్సు జాతీయ రహదారిని దాటుతుండగా వెంకటేష్‌ తన వాహనాన్ని పక్కకు నిలిపివేశాడు. కానీ అంతలోనే వెనుక నుంచి వచ్చిన సెయింట్‌ మేరీస్‌ ఇంజినీరింగ్‌ కళాశాల బస్సు, ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. ఈ ధాటికి మధుశాలిని వాహనం మీదినుంచి ఎగిరిపడగా, కళాశాల బస్సు ఆమె తల మీదుగా దూసుకెళ్లింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే మరణించింది. వెంకటేష్‌ స్వల్పంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని వారిని ఆసుపత్రికి తరలించారు.