ముంబై, డిసెంబర్ 21 : టీమిండియా క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లి ఎన్నో రికార్డులను తన పాదాక్రాంతం చేసుకుంటూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. తాజాగా భారత్లో అత్యధిక బ్రాండ్ విలువ కలిగిన సెలబ్రిటీగా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్.. అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. కోహ్లి ఆయనను అధిగమించి అగ్రస్థానంలోకి చేరారు. సెలబ్రిటీల బ్రాండ్ విలువను ప్రకటించడం ఆరంభించాక షారుఖ్ ఖాన్ అగ్రస్థానం కోల్పోవడం ఇదే తొలిసారి అని డఫ్ అండ్ ఫెల్ప్స్ సంస్థ ప్రకటించింది. కాగా ప్రస్తుతం భారత సెలబ్రిటీలలో కోహ్లి రూ. 921 కోట్ల బ్రాండ్ విలువతో ప్రథమ స్థానంలో ఉండగా.. షారుఖ్ ఖాన్ రూ. 678 కోట్ల బ్రాండ్ విలువతో రెండో స్థానానికి చేరారు. అలాగే మూడో స్థానంలో దీపికా పదుకొనె(రూ. 595 కోట్లు), నాలుగో స్థానంలో అక్షయ్ కుమార్(రూ. 300 కోట్లు) నిలిచారు. “జార్ఖండ్ డైనమైట్” ధోని 13వ స్థానంలో కొనసాగుతున్నాడు. అలాగే పి.వి. సింధు రూ. 95 కోట్ల బ్రాండ్ విలువతో 15వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో స్థానం సంపాదించుకున్న మహిళా క్రీడాకారిణిగా సింధు చోటు దక్కించుకోవడం విశేషం.