హైదరాబాద్, డిసెంబర్ 20 : ఉత్తర భారతం నుంచి వీస్తున్న శీతల గాలుల వల్ల ఉష్ణోగ్రతలు బాగా పడిపోయి తెలంగాణ చలికి గజగజ వణుకుతోంది. తెలంగాణ రాష్ట్ర౦లోనే మునుపెన్నడూ లేని విధంగా అతి తక్కువ 3.8 డిగ్రీల ఉష్ణోగ్రత ఆదిలాబాద్లో నమోదైంది. ఈ ఉష్ణోగ్రత మరింత పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖా అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఆదిలాబాద్లో అత్యల్పంగా 3.8 ఉష్ణోగ్రత నమోదు కాగా, మెదక్లో 8, భద్రాచలం, రామగుండంలో 12, హైదరాబాద్లో 13 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తర భారతం నుండి తెలంగాణలోకి అధికంగా చల్ల గాలులు వీస్తున్నందున రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకురాలు నాగరత్న వెల్లడించారు. చలి బారిన పడకుండా పిల్లలు, పెద్దలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, రోగులు, పిల్లలపట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని, రాత్రి వేళల్లో బయటకు రాకూడదని పేర్కొన్నారు.