హైదరాబాద్, డిసెంబర్ 19: ఇటీవల వివాహం చేసుకున్న నూతన వధూవరులు భారత సారధి విరాట్ కోహ్లీ-అనుష్క జంట ప్రస్తుతం హనీమూన్లో ఉన్నారు. ఈ సందర్భంగా వారిద్దరూ కలిసి దిగిన సెల్ఫీని అనుష్క ఇటీవల ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ సెల్ఫీని విరుష్క అభిమానులు ఫోటోషాప్ చేసి సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు. ఈ జంట లాహోర్, ఇస్లామాబాద్, కరాచీ, ఇంకా పలు ప్రముఖ ప్రదేశాలు, రెస్టారెంట్ల ముందు సెల్ఫీ దిగినట్లు చూపుతూ ఎడిటింగ్ చేశారు. ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. విరుష్కల పెళ్లి విందును డిసెంబరు 21న ఢిల్లీలోని తాజ్ డిప్లొమాటిక్ ఎన్ క్లేవ్లో బంధువుల కోసం, డిసెంబరు 26న ముంబాయిలో సినీ, క్రీడా, ఇతర రంగాలకు చెందిన ప్రముఖుల కోసం ఏర్పాటు చేయనున్నారు.