లండన్, జూన్ 17 : లండన్లో జరిగిన గ్రెన్ఫెల్ టవర్ అగ్నిప్రమాదంలో మృతులు సంఖ్య 17 కు చేరుకున్నది. గురువారం మంటలు పూర్తిగా ఆరిపోయినప్పటికీ భవనంలో నుంచి ఇంకా పొగలు వస్తున్నాయి. లోపల ఎవరూ సజీవంగా ఉండే అవకాశమే లేదని అగ్నిమాపకదళం అధికారులు అంటున్నారు. పూర్తిగా ధ్వంసమైన భవనం నుంచి ఓ పెద్ద శకలం కిందకు జారిపడింది. భవనంలో తనిఖీలు జరిపితే మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నాయని సమాచారం. గ్రెన్ఫెల్ టవర్ అగ్నిప్రమాదానికి ఉగ్రవాదంతో ఎలాంటి సంబంధం లేదని ఫైర్ సర్వీస్ చీఫ్ డేనీ కాటన్ అన్నారు. ప్రధాని థెరెసామే గురువారం ఉదయం అగ్నిప్రమాదం జరిగిన భవనాన్ని సందర్శించారు. ప్రమాద ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆమె ఆదేశించారు. అగ్నిప్రమాదంలో అనేకమంది ప్రాణాలు కోల్పోవడం పట్ల బ్రిటిష్ రాణి ఎలిజబెత్ సంతాపం వ్యక్తం చేశారు. రంజాన్ ఉపవాస విరామం కారణంగా అర్ధరాత్రి మేల్కొని ఉన్న ముస్లిం కుటుంబాలు లండన్ అగ్నిప్రమాదంలో పలువురి ప్రాణాలను కాపాడాయి. దుర్ఘటన సంభవించిన అపార్ట్మెంట్లో ఎక్కువగా ముస్లిం కుటుంబాలే నివాసముంటున్నాయి. ఘటన జరిగిన సమయంలో చాలామంది మెలకువగానే ఉన్నారు. అప్రమత్తం చేయకపోతే ప్రాణనష్టం భారీగా జరిగేది అని స్థానికులు తెలిపారు. రంజాన్ మాసం సందర్భంగా తెల్లవారుజామున ప్రారంభమయ్యే సహర్ ఉపవాస దీక్షలకు సిద్ధం చేసుకుంటున్న తరుణంలో మంటలు భవంతిని చుట్టుముట్టాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ముస్లిం యువకులు, పిల్లలు రాత్రంతా సమీపంలోని మసీదులకు, ప్రార్థనలకు వెళ్లి వస్తున్నారు. వారు చేసిన ప్రార్థనలకు అల్లా కరుణించడంతో తమ ప్రాణాలు రక్షించుకోగలిగామని ముస్లిం కుటుంబాలు భావించాయి.