న్యూఢిల్లీ, డిసెంబర్ 18 : దేశీయ తయారీదార్లను రక్షించేందుకు ఇటీవల ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా ఇందులో స్మార్ట్ఫోన్లు, టీవీలు, మైక్రో ఓవెన్లు, ఎల్ఈడీ ల్యాంపులు ఉన్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం యాపిల్ అమాంతం ధరలను పెంచేసింది. ఐఫోన్ ఎస్ఈ మినహా దాదాపు అన్ని ఐఫోన్ మోడళ్లపై 3.5శాతం వరకు ధరలను పెంచినట్లు యాపిల్ సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా ఈ పెరిగిన ధరలు నేటి నుండే అమలులోకి రానున్నాయని పేర్కొంది. అత్యంత ఖరీదైన ఐఫోన్ టెన్ X(256 జీబీ) మోడల్ ప్రస్తుత ధర రూ. 3000 ఉండగా, రూ.3500 పెరిగి మార్కెట్లో రూ. 1,05,720గా ఉంది. అలాగే ఐఫోన్ 6ఎస్ మోడళ్ల ధరలు రూ. 1500 పెరిగి వరుసగా రూ. 30,780, రూ. 41,550గా ఉన్నాయి. ఇక ఐఫోన్ ఎస్ఈ ఫోన్ లను భారత్లోనే తయారు చేస్తుండటంతో వీటికి ఎటువంటి రుసుము విధించలేదు.