రాజంపేట, డిసెంబర్ 17 : మాదక ద్రవ్యాలను విదేశాలకు ఎగుమతి చేస్తూ...పట్టుపడ్డ ముఠాను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన కడప జిల్లా రాజంపేటలో చోటుచేసుకుంది. స్థానికంగా డ్రగ్స్ వ్యాపారం సాగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందటంతో నిఘాను పెంచారు. కాగా, నేడు అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి, ఎనిమిది మంది అదుపులోకి తీసుకోగా.. మరో ఇద్దరు పరారయ్యారు. నిందితుల నుంచి పోలీసులు కిలోకి పైగా బ్రౌన్ షుగర్ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే, ఇది నిజమైన బ్రౌన్ షుగరా కాదో అనే విషయం పరీక్షల ద్వారా తేలాల్సి ఉంది. పోలీసుల విచారణలో ఉన్న నిందితుల్లో విద్యార్థులతో పాటు ప్రముఖుల పిల్లలు ఉండటంతో కేసును నీరుగార్చడానికి తెరవెనుక ప్రయత్నాలు జరగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.