హైదరాబాద్, డిసెంబర్ 17: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అన్ని వర్గాలతో పాటు పాత్రికేయులు సైతం కీలకపాత్ర పోషించారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వారి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని ఆయన తెలిపారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలతో పాటు, వారి సంక్షేమం కోసం ప్రత్యేక నిధిని సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆయన పేర్కొన్నారు. పాత్రికేయులు మంచి వార్తలు రాస్తూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిల పనిచేయాలని ఆయన సూచించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మిలియన్ మార్చ్, సాగరహారం సందర్భంగా ధ్వంసమైన కెమెరాల స్థానంలో కొత్త కెమెరాలను శనివారం మంత్రి నివాసంలో జరిగిన కార్యక్రమంలో బాధితులకు అందజేశారు. మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ నవీన్మిత్తల్, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులు, తెలంగాణ ఫొటో జర్నలిస్టు అసోసియేషన్ సంఘాల నేతలు క్రాంతికిరణ్, రవికుమార్, జి.భాస్కర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని, మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.