శ్రీనగర్, జూన్ 17 : దక్షిణ జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో శుక్రవారం గస్తీ నిర్వహిస్తున్న పోలీసులపై ఉగ్రవాదులు ఆకస్మికంగా దాడి చేయడంతో ఆరుగురు పోలీసులు మృతిచెందారు. ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరుపడంతో సబ్ఇన్స్పెక్టర్ ఫిరోజ్ సహా ఆరుగురు పోలీసులు చనిపోయారని అధికారులు వెల్లడించారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల ముఖాలను గుర్తు పట్టరాకుండా ఉగ్రవాదులు చిధ్రం చేశారని తెలిపారు. మరో ఘటనలో భద్రతాదళాలతో 8 గంటలపాటు జరిగిన ఎదురుకాల్పుల్లో కరుడుగట్టిన ఉగ్రవాది, లష్కరే కమాండర్ జునైద్ మట్టూ హతమయ్యాడు. అతనితోపాటు ఉన్న ముజమిల్ అనే ఉగ్రవాది కూడా ఎన్కౌంటర్లో చనిపోగా మరో ఉగ్రవాదిని పోలీసులు ప్రాణాలతో పట్టుకున్నారు. అనంతనాగ్ జిల్లా అర్వని లోని ఓ ఇంట్లో ముగ్గురు లష్కరే తాయిబా ఉగ్రవాదులు దాక్కోగా ఆర్మీ ఆపరేషన్ చేపట్టింది. భద్రతా బృందాలపై స్థానికులు పెద్దఎత్తున రాళ్లు విసరడంతో జవాన్లు టియర్ గ్యాస్, పెల్లెట్ తుపాకులతో కాల్పులు జరిపారు. ఇందులో ఇద్దరు పౌరులు మృతి చెందగా పదిమంది గాయపడ్డారు. అనంతరంలో ఇంట్లో దాగిన ఉగ్రవాదుల్ని సైనికులు మట్టుబెట్టారు. ఈ దాడిలో సుమారు 15మంది ఉగ్రవాదులు పాల్గొన్నట్లు సమాచారం. ఈ మేరకు పలు ఉగ్రదాడుల్లో జునేద్ హస్తం ఉన్నట్లు ఆర్మీ తెలిపారు.