అమరావతి, జూన్ 17 : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబులు ఇద్దరు కుమ్మకయ్యారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్ర పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. గత మూడు సంవత్సరాల నుంచి ప్రజలను దోచుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఈ దోపిడిలో ప్రధాని మోదీకి కూడా భాగస్వామ్యం ఉందని రఘువీరారెడ్డి విమర్శించారు.అందువల్లే ఇతర రాష్ట్రాల్లో ఈడీ, సీబీఐ దర్యాప్తులు జరుగుతున్నప్పటికీ ఏపీలో మాత్రం అలాంటివి సంభవించడం లేదని తెలిపారు. ఓటుకు నోటు కేసు సహా పలు అంశాలపై దర్యాప్తుకు మోదీ ముందుకు రాకపోవడానికి గల కారణాలను స్పష్టం చేయాలన్నారు. విశాఖ భూముల వివాదంలో జిల్లా కలెక్టర్ వాస్తవాలను వెల్లడించకుండా ఉండేందుకు ప్రభుత్వం త్రిసభ్య కమిటీని వేసి కొత్త నాటకాన్ని సృష్టిస్తుందన్నారు. చంద్రబాబు చేసే అవినీతి కార్యక్రమాలను ప్రజలలో బహిర్గతం చేసి, దశలవారీగా ఆందోళన నిర్వహిస్తామని అన్నారు.