వరంగల్, డిసెంబర్ 16: వరంగల్ జిల్లా ఉట్నూరులో జరిగిన హింసాకాండ నేపథ్యంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈరోజు నిరసనలు జరిగాయి. ఆదివాసీలు, లంబాడీలు పోటాపోటీగా ర్యాలీలు, ధర్నాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు అప్రమత్తమై భారీగా బలగాలను మొహరించారు. ఈ నేపధ్యంలో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి వరంగల్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ విధిస్తున్నట్టు కమిషనర్ జి.సుధీర్ తెలిపారు. వారం రోజుల పాటు 144 సెక్షన్ అమలులో ఉంటుందని స్పష్టం చేస్తూ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను కమిషనర్ శనివారం జారీ చేశారు. 144 సెక్షన్ అమలులో ఉండటం వల్ల పోలీసుల అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించడం చట్టరీత్యానేరమని ఆయన పేర్కొన్నారు. సహకరించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.