హైదరాబాద్, డిసెంబర్ 16 : ప్రపంచ తెలుగు మహాసభలు నిన్న సాయంత్రం అంగరంగ వైభవంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ వేడుకలకు దేశ విదేశాల నుండి ప్రతినిధులు, సాహితీవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. “ఎంత గొప్ప వ్యక్తికైనా అమ్మ ఒడి నుంచే జీవిత నడవడి మొదలవుతుంది. తెలుగు భాషా పరిరక్షణకు అందరం సంకల్పించాలి. నా చిన్నతనంలో మా గురువు మృత్యుంజయ శర్మ ప్రోత్సాహంతో నాలో సాహిత్య పిపాస పెరిగింది. తొమ్మిదో తరగతిలోనే తెలుగు పద్యాలు రాశా. ఆ గొప్పతనం నాది కాదు మా గురువులది" అంటూ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం తెలుగును ఒకటి నుంచి 12వ తరగతి వరకు ఒక సబ్జెక్టుగా నేర్చుకోవాలని జీవో జారీ చేసింది. సమాజం భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది. దేశాన్ని మార్గదర్శకంగా నడిపించే వాళ్ళు వారే. తెలుగు భాష అభివృద్ధి చెందాలంటే ఒక పండితుడు మరో పండితుడిని తయారు చేయాలి అంటూ కేసీఆర్ పలు సూచనలు చేశారు. తన చిన్ననాటి సంగతులను గుర్తు చేసుకుంటూ అనేక పద్యాలను వివరిస్తూ తెలుగు గొప్పతనాన్ని వర్ణించారు.