విశాఖపట్నం, డిసెంబర్ 16 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో నేడు హెలీ టూరిజం ఎట్టకేలకు ప్రారంభంకానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులమీదుగా మధ్యాహ్నం 12.45 గంటలకు జెండా ఊపి హెలికాప్టర్ను ప్రారంభించనున్నారు. అనంతరం అదే హెలికాప్టర్లో విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆ తరువాత అందులో ఆసక్తిగల వారిని జాయ్ రైడ్కు తీసుకువెళతారు. ఆదివారం కూడా ఈ పర్యటన అందుబాటులో ఉంటుంది. రెండు రోజులకు కలిపి 100 టిక్కెట్లను పర్యాటకులకు విక్రయిస్తారు. ఇది పర్యాటక శాఖ కేంద్రాల్లో లభిస్తాయి. వుడా పార్కులో ఇప్పటికే చేసిన ఏర్పాట్లతోనే పవన్ హ్యాన్స్ సంస్థ దీనిని నడుపుతుంది. వుడా పార్కులో హెలికాప్టర్ ఎక్కించుకొని తెన్నేటిపార్కు, రుషికొండ, ఎర్రమట్టి దిబ్బలు, తొట్లకొండ, కైలాసగిరి మీదుగా నగరంలోకి వచ్చి వుడా పార్కులో దింపుతారు. మొత్తం పది నిమిషాల పాటు హెలికాప్టర్లో తిప్పుతారు. దీనికి టిక్కెట్ ధర రూ.2,499గా నిర్ధారించారు.