హైదరాబాద్, డిసెంబర్ 15 : ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్ ఎల్బీ మైదానంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉపరాష్ట్ర పతి ఎం. వెంకయ్య నాయుడు మాట్లాడుతూ " తెలుగు భాష అత్యంత విలువైనది. కన్న తల్లిని, జన్మ భూమిని, మాతృ దేశాన్ని మరిచిపోయేవాడు మనిషే కాదు. సమాజంలో గురువు ప్రాధాన్యత ఎనలేనిది. గూగుల్ వచ్చినా, ఇంటర్నెట్ వచ్చినా దాన్ని తెలుసుకునేందుకు కూడా గురువు అవసరం. గూగుల్ గురువుకు ప్రత్యామ్నాయం కాదు. నా దృష్టిలో తెలుగు భాషే నా తల్లి. దిల్లీలో ఎక్కడైనా తెలుగు మాట వినిపిస్తే వెనక్కి తిరిగి చూసేవాడిని. ఎవరైనా తెలుగు భాష, యాసలో మాట్లాడుతుంటే నా మనసు పులకించేది. నేను పుట్టి పెరిగిన తెలుగు రాష్ట్రాలకు నెలకొకసారైనా రాకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. తెలంగాణ గడ్డపై తెలుగు మహాసభలు జరగడం నిజంగా అభినందనీయం. ప్రతి ఒక్కరు మన యాస, భాష, కట్టుబొట్టు లను కాపాడుకోవాలి. కేసీఆర్ ప్రసంగం నా మనసుకి హత్తుకుంది. ఎందరో దిగ్గజ కవులు మన భాషను సృజించారు. ప్రతి ఒక్కరు భాషలు నేర్చుకోవాలి కానీ మాతృ భాష ను మర్చిపోకూడదు." అని వ్యాఖ్యానించారు.