అమరావతి, డిసెంబరు 15 : అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మెగా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ‘పెన్సిల్వేనియా స్టేట్ సిస్టమ్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చొరవ తీసుకుంటుంది. దీనికి సంబంధించిన రాయబారి కనికా చౌదరి నేతృత్వంలోని ఒక ఉన్నతస్థాయి బృందం గురువారం సచివాలయంలో సీఎం చంద్రబాబుతో సమావేశం అయ్యింది. ఈ మేరకు సీఎం సమక్షంలో పీఏఎస్ఎస్ హెచ్ఈతో ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవల్పమెంట్ బోర్డు(ఏపీఈడీబీ) లెటర్ ఆఫ్ ఇండెంట్ తీసుకుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా పరిపాలనా విధానాలను మరింత బలోపేతం చేయడం, పనితీరు సూచికలు, మాస్టర్ ప్లాన్ కోసం సచివాలయంలో ఈ ఒప్పందం చేసుకున్నారు. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి దినేశ్కుమార్, లీకాన్ యూస్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ(ఎల్కేవైఎస్ పీపీ) డీన్ మహబూబాని, ఆ సంస్థకు చెందిన అసోషియేట్ ప్రొఫెసర్ టాన్ ఖీజియప్ దీనిపై సంతకాలు చేశారు. ఇదిలావుండగా, రాష్ట్రంలో ‘అమరావతి పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా’ ఆవిర్భవించనుంది. ఈ చాప్టర్ను ఈ నెల 16వ తేదీన విశాఖపట్నంలో జరిగే 39వ జాతీయ ప్రజాసంబంధాల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమంలో పెన్సిల్వేనియా స్టేట్ సిస్టమ్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్’ ఎగ్జిక్యూటివ్ వైస్చాన్సెలర్ డాక్టర్ పీటర్ గార్లాండ్, ఇండియానా యూనివర్సిటీ అకడమిక్ వ్యవహారాల కార్యదర్శి డాక్టర్ తిమోతి ఎస్ మోర్లాండ్, రుయా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుహాస్ పెడ్నేకర్ తదితరులు పాల్గొన్నారు.