నార్సింగి, డిసెంబర్ 14: చిన్నారులకు చాక్లెట్లు కొనిస్తానని మాయ మాటలు చెబుతూ, తమ కామ పైశాచికత్వంతో వారిని బలి తీసుకుంటున్నారు. ఇందుకు ఉదాహరణ నార్సింగి మండలం ఐదేళ్ళ బాలికపై, వనపర్తి మండంలం పెద్దగూడెంలో ఆరేళ్ళ చిన్నారిపై జరిగిన లై౦గిక దాడులు. వివరాల్లోకి వెళితే... ఒడిశాకు చెందిన ఓ కుటుంబం సెంట్రింగ్ పనిచేసుకుంటూ నార్సింగి మండలం నెక్నాంపూర్ గ్రామం అల్కాపూర్ కాలనీలోని ఆర్యమిత్ర లేబర్ అడ్డాలో నివసిస్తోంది. వారికి ఐదేళ్ల కుమార్తె ఉంది. వీళ్ల ఇంటి పక్కన మధ్యప్రదేశ్కు చెందిన దినేష్కుమార్ ధర్నే (23) నివసిస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం దినేష్ ఆ బాలికను చాక్లెట్ ఇస్తానని పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి, ఎవరికైనా చెబుతుందేమోనని ఇటుకతో తలపై కొట్టి చంపేశాడు. తమ కూతురి ఆచూకీ దొరకడం లేదని ఆ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా, దినేష్ను గట్టిగా విచారించడంతో నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు మృతదేహాన్ని వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి తరలించి, దినేష్ను అరెస్టు చేశారు. ఈ ఘటన జరిగిన మూడు రోజుల తరువాతే మరో లైగింక దాడి చోటు చేసుకుంది. మండలంలోని పెద్దగూడెంలో బురాన్స్వామి అనే వ్యక్తి నిర్మించే భవనంలో కూలీలుగా పనిచేస్తున్న రామకృష్ణ, మధు, నర్సింహులు ఆదివారం అక్కడే మద్యం తాగారు. నిర్మాణ కూలీగా పని చేస్తున్న కల్పన కుమార్తె నాగేశ్వరి (6)ని రామకృష్ణ (28) చాక్లెట్ కొనిపెట్టి భవనంపైకి తీసుకువెళ్లి, లైంగిక దాడి చేయడంతో తట్టుకోలేక బాలిక మరణించింది. రామకృష్ణ నాగేశ్వరి మృతదేహాన్ని భవనంలోనే ఒక గదిలో సజ్జపై తోసేసి, పైన సిమెంటు సంచి కప్పి వచ్చేశాడు. తర్వాత ముగ్గురు వనపర్తికి తిరిగొచ్చేశారు. తల్లిదండ్రులు ఆంజనేయులు, కల్పన ఫిర్యాదు మేరకు నాగేశ్వరి కోసం వెతికిన పోలీసులు రామకృష్ణ, మధు, నర్సింహులను విచారించారు. రామకృష్ణ నిజం ఒప్పుకోవడంతో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.