హైదరాబాద్, డిసెంబర్ 13 : హోంగార్డులపై ముఖ్యమంత్రి వరాలు కురిపించారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, హోంగార్డులతో ప్రగతి భవన్లో సమావేశమైన కేసీఆర్ వారి జీతాలను రూ.20వేలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. దానితో పాటు సంవత్సరానికి రూ.వెయ్యి చొప్పున పెంపుదలను అమలు చేస్తానన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. "రోస్టర్ విధానం లేకుండా ఎలాంటి నియామకాల ప్రక్రియ జరగకూడదు. ట్రాఫిక్ విభాగంలో పనిచేసే హోంగార్డులకు శాశ్వత ఉద్యోగితో సమానంతో జనవరి నుంచే అలవెన్సు ఇస్తాం. అలాగే మహిళా హోంగార్డులకు ప్రసూతి సెలవులను ఆరు నెలలకు పొడిగిస్తాం. ప్రత్యేక కానిస్టేబుళ్ల నియామకాలలో హోంగార్డులకు 25శాతం, రిజర్వ్డ్ కానిస్టేబుళ్ల నియామకంలో 15శాతం, డ్రైవర్ల నియామకంలో 20శాతం, అగ్నిమాపక శాఖలో 25శాతం, కమ్యూనికేషన్ విభాగంలో 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం" అంటూ హామీ ఇచ్చారు.