హైదరాబాద్, డిసెంబర్ 13 : మంత్రి కేటీఆర్ భవన నిర్మాణ వ్యర్థాల సేకరణ నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "మన నగరం" పేరుతో ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు నగరంలో పర్యటన చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇందు కోసం బస్తీలు, కాలనీల్లో వారానికోసారి కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అలాగే వ్యర్థాలను పునరుత్పాదక ఇంధనంగా మార్చేందుకు వీలుగా 20మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని త్వరలోనే జవహర్నగర్లో ప్రారంభి౦చనున్నామని తెలిపారు. జీహెచ్ఎంసీ కమిషనర్ డాక్టర్.బి.జనార్దన్రెడ్డి మాట్లాడుతూ.. పాత ఇంటిని కూల్చాలనుకునే వారు జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ నంబరు 040-2111 1111కు ఫోన్ చేయవచ్చన్నారు. ఇందుకోసం ఓ యాప్ కూడా రూపొందించినట్లు ప్రకటించారు. మొబైల్ లో "మై జీహెచ్ఎంసీ" అనే యాప్ ను డౌన్లోడ్ చేసి "సీఅండ్డీ వేస్ట్ లిఫ్టింగ్" అనే ఆప్షన్ను ఎంచుకుని ట్రక్కు సేవల్ని పొందవచ్చన్నారు.