హైదరాబాద్, డిసెంబర్ 12 : ఈ నెల 15 వ తేదీ నుండి ప్రారంభం కానున్న ప్రపంచ తెలుగు మహా సభల నిమిత్తం ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా.. సాహిత్య అకాడమీ చైర్మన్, అలాగే వివిధ నిర్వాహకుల నుండి సమావేశాల కార్యక్రమాల గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ సభలలో ప్రతి రోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. మహాసభల్లో ప్రారంభ, ముగింపు సమావేశాలు నిర్ణయాత్మకంగా ఉండాలని, ఎక్కడా, ఎలాంటి లోటు జరగకుండా జాగ్రత్త వహించాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా వివిధ భాషల్లో రచనలు చేసి జ్ఞానపీఠ్ అవార్డులను పొందిన రచయితలను సత్కరించాలని ముఖ్యమంత్రి వెల్లడించారు.