వాషింగ్టన్, జూన్ 16 : సుమారు 50 ఏళ్లుగా అంటిముట్టనట్టుగా ఉన్న అమెరికా, క్యూబాల మధ్య స్నేహపూరిత వాతావరణం తీసుకొచ్చేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ఎంతో కృషి చేశారు. విభేదాలు విడనాడి పరస్పరం సహకరించుకునేందుకు వీలుగా 2014లో ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. దాంతో 2015 జులై నుంచి ఆ దేశాల మధ్య స్నేహపూరిత వాతావరణం కొనసాగుతోంది. అయితే ఇప్పుడు ఆ ఒప్పందాలకు మంగళం పాడాలని ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారట. అమెరికా నుంచి క్యూబాకు వెళ్లేందుకు సంబంధించిన నిబంధనలను కఠినతరం చేసేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అమెరికన్ కంపెనీలు క్యూబా మిలటరీ నియంత్రణలో ఉన్న సంస్థలలో వ్యాపారాలు సాగించకుండా కట్టడి చేయాలని ఆయన భావిస్తున్నారట. ఈ నిబంధనలకు సంబంధించిన వివరాలను శుక్రవారం మియామీలో ట్రంప్ ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే క్యూబాకు అమెరికా నుంచి పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే ఇరు దేశాల వ్యాపార సంబంధాలపైనా ప్రభావం పడుతుందని అభిప్రాయపడుతున్నారు.