హైదరాబాద్, డిసెంబర్ 10 : ఎల్బీనగర్ ఎమ్మెల్యే బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య నేడు ఏపీ సీఎం చంద్రబాబును కలిసి సమావేశమయ్యారు. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో కలిసిన ఆయన బీసీల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం మరిన్ని పథకాలు ప్రవేశపెడుతోందని, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీలకు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. అంతేకాకుండా రూ.20వేల కోట్లతో బీసీ ఉపప్రణాళిక ఏర్పాటు చేయాలన్నారు. కాగా, బీసీ రిజర్వేషన్ల కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని చేసిన విజ్ఞప్తిని చంద్రబాబు అంగీకరించారన్నారు. త్వరలోనే ప్రధాని అపాయింట్మెంట్ తీసుకుని అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామని చంద్రబాబు చెప్పినట్లు కృష్ణయ్య వెల్లడించారు. చట్టసభల్లో బీసీలకు 50శాతం స్థానం కల్పించే దిశగా కృషి చేయాలని డిమాండ్ చేశారు.