బీజింగ్, డిసెంబర్ 09 : చైనా భూభాగంలో భారత్ కు సంబంధించిన డ్రోన్ పడిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై చైనా, భారత్ పై పలు ఆరోపణలు చేస్తుంది. అంతేకాకుండా చైనా భూభాగంలోకి డ్రోన్ చొరబడినందునా భారత్ క్షమాపణలు చెప్పాలంటూ టైటిల్ పెట్టి చైనా మీడియా గ్లోబల్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. కొద్ది నెలల క్రితం సిక్కిం సెక్టార్లోని డోక్లాం సరిహద్దు విషయంలో భారత్-చైనా మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే ప్రాంతంలోకి భారత్ డ్రోన్ వచ్చింది. ఆ ప్రాంతం చాలా సున్నితమైనది, ఇరుదేశాలు అక్కడ ఎటువంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకూడదని ముందుగానే ఒప్పందం చేసుకున్నాయి. కానీ, భారత్ మాత్రం అలా ప్రవర్తించలేదు. ఇందుకు భారత్ క్షమాపణలు చెప్పాలని గ్లోబల్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. దీనిపై స్పందించిన భారత్, సాంకేతిక లోపం కారణంగానే డ్రోన్ వచ్చిందని చెబుతోంది. కాగా, భారత్ మాత్రం సాంకేతిక కారణాల వల్ల డ్రోన్కు గ్రౌండ్ కంట్రోల్ విభాగంతో సంబంధాలు కోల్పోయిందని చెప్పింది. దీంతో సిక్కిం సెక్టార్ వద్ద వాస్తవాధీన రేఖను దాటింది. దీని గురించి చైనా దళాలకు ముందుగానే సమాచారం ఇచ్చామని భారత్ వివరణ ఇచ్చింది. కానీ చైనా మాత్రం దీనికి భిన్నంగా ప్రచారం చేస్తుందన్నారు.