న్యూఢిల్లీ, డిసెంబర్ 9: ప్రస్తుతం ఉన్న కాలంలో అమ్మాయిలు కొన్ని రకాల క్రీడలలోనే రాణిస్తారనే అపోహను మార్చేశారని కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్సింగ్ రాథోడ్ అన్నారు. విజేతల కొరకు బాక్సింగ్ సమాఖ్య ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... గువాహటిలో నిర్వహించిన పోటీల్లో ఐదు స్వర్ణాలు, రెండు రజతాలు కైవసం చేసుకుని బృంద ఛాంపియన్షిప్ సాధించిన బాక్సర్లు అందరికీ రూ.6.70 లక్షలు బహుమతిగా అందిస్తామన్నారు. ఈ దేశంలోని అమ్మాయిలందరికీ వీరి కథ ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. ఇప్పటినుండి ప్రతి క్రీడకు సీఈఓ, హై ఫర్ఫార్మెన్స్ మేనేజర్లను నియమిస్తామన్నారు. టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకాన్ని మరింత మెరుగుపరిచి టోర్నీల్లో, శిక్షణలో రాణించేలా చేస్తామని పేర్కొన్నారు. క్రీడా పరిపాలనలో మరింతా పారదర్శకత పెంచేందుకు కృషి చేస్తామని తెలిపారు.