అమరావతి, జూన్ 15 : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూ.100 కోట్ల వ్యయంతో వంద ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. ఇందుకు సహకరించాలని ప్రముఖ ప్రకృతి సేద్యరంగ నిపుణుడు సుభాష్ పాలేకర్ను ఆహ్వానించడంతోపాటు ప్రకృతి సాగుకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఆయన్ను నియమించారు. పాలేకర్ బుధవారం ఉండవల్లిలోని సీఎం నివాసంలో చంద్రబాబును కలసి.. రాష్ట్రంలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ స్థితిగతులను గురించి చర్చించారు. కాగా ఈ విజ్ఞానంపై త్వరలో పాలేకర్తో రైతులకు పాఠాలు చెప్పిస్తామని, రైతుల సందేహాల్ని నివృత్తి చేస్తామని సీఎం చెప్పారు.