ముంబై, డిసెంబర్ 08: గుజరాత్ ఎన్నికల వేళ బీజేపీకి షాక్ తగిలింది. కేంద్రం, రాష్ట్రంల్లో అధికారంలో ఉండగా మహారాష్ట్రకు చెందిన గోండియా పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ ఎ౦పీ నానా పటోల్ ఈ రోజు తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈయన ఎన్సీపీ నేత ప్రపుల్ పటేల్ పై విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోదీ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్కు రాసిన రాజీనామా లేఖలో నానా పటోల్ మొత్తం 14 అంశాలను లేవనెత్తారు. మోదీ నిర్ణయాల వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, నోట్ల రద్దు, జీఎస్టీ కూడా తన రాజీనామా నిర్ణయానికి కారణమన్నారు. గత కొన్నాళ్లుగా బీజేపీ పార్టీలో రెబల్గా ఉన్న ఎంపీ నానా, అక్టోబర్లో శివ సేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేను కూడా కలిసినట్లు ఆయన గతంలో తెలిపారు. కాగా ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకొని ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ వర్గాలు ఆరోపించాయి.