దుబాయ్, డిసెంబర్ 07 : ఇంకా కొన్ని రోజుల్లో 2017 కు వీడ్కోలు చెప్పబోతున్నాం. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) క్రికెట్ బోర్డు ఈ సంవత్సరం జరిగిన మ్యాచ్ లన్నింటిలో ఒక వీడియోను బెస్ట్ మూమెంట్ అంటూ తన ట్విట్టర్ వేదికగా పంచుకుంది. అయితే ఆ వీడియో ఏంటో తెలుసా...? భారత్- పాకిస్తాన్ మధ్య 2017 జూన్ 17లో జరిగిన ఛాంపియన్ షిప్ ఫైనల్లో చోటు చేసుకున్న ఓ సన్నివేశం, ఈ ఏడాది ‘స్పిరిట్ ఆఫ్ మూమెంట్’గా నిలిచింది. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు పాక్ చేతిలో 180 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. పాక్ బ్యాట్స్ మెన్ ఫఖర్ జమాన్ 114 పరుగులతో ఆదరగొట్టగా, ఆమిర్, హసన్ అలీ, బౌలింగ్ ధాటికి భారత్ 158 పరుగులకే ఆలౌటైంది. మ్యాచ్ తర్వాత అవార్డుల ప్రదానోత్సవ వేడుకలకు ఇరు జట్ల ఆటగాళ్లు విచ్చేశారు. ఆ సమయంలో టీమిండియా క్రీడాకారులు కోహ్లీ, యువరాజ్, పాక్ ఆటగాడు షోయబ్ మాలిక్, బౌలింగ్ కోచ్ అజార్ మహమూద్ కలిసి సరదాగా మాట్లాడుకుంటున్న వీడియో అప్పట్లో తెగ హల్ చల్ చేసింది. మన వాళ్లు ఓటమి చెందిన క్రీడాస్ఫూర్తితో మెలిగారంటూ అప్పట్లో ఇరు జట్ల ఆటగాళ్లపై పలువురు ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పుడు అదే వీడియో 2017 బెస్ట్గా నిలవడం విశేషం.