రానమండ్రి, డిసెంబర్ 07: ముఖ్యమంత్రి కావడమే రాజకీయం కాదని, నిస్వార్ద సామాజిక సేవ చేయడమే అసలైన రాజకీయం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న పవన్ ఈ రోజు పోలవరం ప్రాజెక్ట్ సందర్శన అనంతరం రాజమండ్రిలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...నన్ను కుల నాయకుణ్ణి చేయాలని చూస్తే ఊరుకోనని, నావి జాతీయ రాజకీయాలని స్పష్టం చేశారు. రాజకీయ పునర్నిర్మాణం కోరుకునే నాయకులే తన వెంట నడవాలని ఆయన పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ 2018 నాటికి పూర్తికాదని, దానిపై తేదేపా ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పరకాల ప్రభాకర్ ఇటీవల చేసిన విమర్శలకు స్పందించిన పవన్... మీ సతీమణి కేంద్రమంత్రి అయినా ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు తీసుకు రావటంలేదని ఘాటుగా ఉద్ఘాటించారు. నిస్వార్ద రాజకీయాలు చేసే నాకు, అదే భావజాలం ఉన్న వ్యక్తులు నావెంట నడవాలని పవన్ కోరారు.