బ్రిటన్, డిసెంబర్ 06 : గత వారం బ్రిటన్ ప్రధాని థెరిసా మేను ఇద్దరు ఉగ్రవాదులు హత్యాయత్నం చేయాలని యోచించరట. ఈ సమాచారం అందుకున్న యూకే మెట్రోపాలిటన్ పోలీసులు ఆ ప్రయత్నాన్ని భగ్నం చేశారు. నేడు మెట్రోపాలిటన్ పోలీసులే ఈ విషయాన్ని స్వయంగా తెలిపారు. లండన్ కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు రెహమాన్(20), బిర్మింగ్హామ్కి చెందిన ఇమ్రాన్(21)లు నవంబర్ 28న ఆమెపై హత్యాయత్నం చేయడానికి పథకం వేస్తుండగా వారిని కౌంటర్ టెర్రర్ కమాండ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక డౌనింగ్ స్ట్రీట్ ప్రాంతంలో థెరిసా కారులో ప్రయాణిస్తారని తెలిసి పేలుడు పదార్థాలు ఏర్పాటుచేయబోయారని, వారిపై అనుమానం రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నాక అసలు విషయం బయటపడిందని అధికారులు వెల్లడించారు. అయితే, ఏడాది నుంచి థెరిసాను అంతం చేయడానికి ఇప్పటికీ తొమ్మిది సార్లు ప్రణాళికలు వేశారని ఆమె ప్రతినిధి తెలిపారు.