అమరావతి, డిసెంబర్ 05 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలవరం ప్రాజెక్టు వివాదంపై ఈ నెల 7,8 తేదీల్లో ప్రాజెక్టు నిర్మాణం, ఆర్థిక ప్రగతి, ఇతర అంశాలపై సమీక్షకు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయనతో పాటు కార్యదర్శి శశిభూషణ్కుమార్, ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎం.వెంకటేశ్వరరావులు పాల్గొననున్నారు. రాష్ట్రం చేపట్టిన పోలవరం ప్రాజెక్టులో ప్రభుత్వం రూ.1483 కోట్ల విలువైన పనికి తాజాగా టెండర్లు పిలవడం, వాటిని నిలుపుదల చేయాలంటూ కేంద్ర జల వనరులశాఖ కార్యదర్శి లేఖ రాసిన నేపథ్యంలో ఈ సదస్సుకు ప్రాధాన్యం ఏర్పడింది. ప్రాజెక్టు నిర్మాణం, ఆర్థిక ప్రగతి, ఇతర అంశాల సమీక్షకు కేంద్ర మంత్రి గడ్కరీ నేతృత్వంలో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు జలవనరుల మంత్రిత్వశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి వర్తమానం పంపింది. ముఖ్యంగా ఈ సమావేశంలో కాఫర్డ్యాం, స్పిల్వే పనుల్లో కొంతభాగాన్ని కొత్త గుత్తేదారుకు అప్పగింత, ఇప్పటివరకూ ఖర్చు చేసిన నిధుల తిరిగి చెల్లింపు, ఆర్ అండ్ ఆర్కు కేంద్ర సాయం వంటి అంశాలు ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం.